Nadeendla Manohar: దివ్యాంగుడైన ట్రైనర్ తో నేలపై కూర్చొని మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్

Minister Nadeendla Manohar Inaugurates Tribal Bamboo Craft Center

  • ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో మంత్రి నాదెండ్ల పర్యటన
  • గిరిజన వెదురు హస్తకళల శిక్షణ, తయారీ, ప్రదర్శన కేంద్రం ప్రారంభం
  • స్థానికులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్న మంత్రి నాదెండ్ల

ఏజెన్సీ ప్రాంత గిరిజనుల నైపుణ్యానికి, ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తూ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పులిరాముడుగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరిజన వెదురు హస్తకళల శిక్షణ, తయారీ, ప్రదర్శన కేంద్రాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు ప్రారంభించారు. మంత్రి నాదెండ్ల స్థానికులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా, పలు అభివృద్ధి కార్యక్రమాలపై హామీ ఇచ్చారు.

నేలపై కూర్చుని ఆప్యాయంగా పలకరింపు

శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం, మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడి శిక్షకుడు, దివ్యాంగుడైన మారయ్యతో ప్రత్యేకంగా మాట్లాడారు. మారయ్య నేలపై కూర్చొని ఉండటాన్ని గమనించిన మంత్రి, తాను కూడా నేలపైనే కూర్చుని శిక్షణా కార్యక్రమం, కేంద్రం పనితీరు గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ, "ఈ కేంద్రంలో మూడు నెలల పాటు వెదురు హస్తకళలపై శిక్షణ ఇస్తాం. ఐటీడీఏ సహకారంతో శిక్షణకు అవసరమైన పరికరాలు అందిస్తున్నాం. ఏడాదికి నాలుగు బ్యాచ్‌లలో, ఒక్కో బ్యాచ్‌లో 200 మంది గిరిజన యువతకు శిక్షణ ఇస్తాం" అని వివరించారు. 

శిక్షణ పూర్తి చేసుకున్న వారికి యూనిట్లు స్థాపించుకునేందుకు బ్యాంకుల ద్వారా రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు రుణాలు అందించే ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. తాము తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని మారయ్య మంత్రిని కోరగా, తక్షణమే చర్యలు తీసుకుంటానని మంత్రి మనోహర్ హామీ ఇచ్చారు.

గిరిజన ఉత్పత్తులకు జాతీయ స్థాయి గుర్తింపు

అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో పండే పంటలకు, హస్తకళల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. "గిరిజన ప్రాంతాల్లో అపారమైన సహజ వనరులు, సారవంతమైన భూములు ఉన్నాయి. కానీ, ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర లభించక గిరిజనులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు గిరిజన సహకార సంస్థ (జిసిసి) ను బలోపేతం చేస్తాం" అని అన్నారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. 

స్థానిక సమస్యలపై తక్షణ స్పందన

ఈ సందర్భంగా గ్రామస్థులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి సమస్య ఉందని చెప్పగా, గురువారం నుంచే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఐటీడీఏ పీఓను మంత్రి ఆదేశించారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా, మే 1వ తేదీ నుంచి బస్సు సర్వీసు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రోడ్ల సమస్యను ఏడాదిలోగా పరిష్కరిస్తామని తెలిపారు. వైద్య సేవలపై ఫిర్యాదు చేయగా, ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకల్లా ఓపీ పూర్తి చేయాలని, మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. 

Nadeendla Manohar
Minister
Tribal Empowerment
Bamboo Crafts
Andhra Pradesh
ITDA
Puliramandu
Bhutayagudam
Skill Development
Disabled Trainer
  • Loading...

More Telugu News