ఉగ్రదాడిలో తెలుగు వ్యక్తులు మృతి చెందడం పట్ల సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు

Telugu Victims in Pahalgam Terrorist Attack CM Chandrababus Grief
  • ఫహల్గామ్ ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తుల మృతి
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
  • ఉగ్రవాద చర్యలు సమాజానికి మాయని మచ్చ వంటివని వెల్లడి
  • ఉగ్రవాదం ద్వారా ఇప్పటివరకు ఎలాంటి లక్ష్యాలు నెరవేరలేదని స్పష్టీకరణ
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో చెందిన ఇద్దరు తెలుగు వ్యక్తులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జె.ఎస్. చంద్రమౌళి, మధుసూదన్ కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఈ విషాద ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి, ఉగ్రవాదుల దాడిలో తెలుగు సమాజానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమని అన్నారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ తీరని లోటును తట్టుకునే శక్తిని ఆ కుటుంబాలకు ఇవ్వాలని ఆకాంక్షించారు.

ఉగ్రవాద చర్యలు సమాజానికి మాయని మచ్చ వంటివని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చరిత్రను పరిశీలిస్తే, ఉగ్రవాదం, హింస ద్వారా ఏ లక్ష్యాలు నెరవేరలేదని స్పష్టమవుతుందని అన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో, ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కేంద్రం తీసుకుంటున్న దృఢమైన, నిర్ణయాత్మక చర్యలకు తమ సంఘీభావం ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ఘోరానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు.
Advertisement
Chandrababu Naidu
Terrorist Attack
Jammu and Kashmir
Pahalgam Attack
Telugu Victims
Andhra Pradesh Government
Narendra Modi
Central Government
Terrorism
India

More Telugu News