Ganta Srinivasa Rao: గంటా శ్రీనివాసరావుకు టీడీపీ హైకమాండ్ హెచ్చరిక

- విశాఖ నుంచి విజయవాడకు హైదరాబాద్ మీదుగా రావాల్సి వచ్చిందన్న గంటా
- అమరావతికి హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరమని వ్యాఖ్య
- ఇదీ విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి అని ఆవేదన
విశాఖపట్నం విమాన ప్రయాణికుల దుస్థితిపై మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. విమాన సర్వీలసులపై గంటా చేసిన వ్యాఖ్యలు వైసీపీ చేతికి ఆయుధాన్ని అందించినట్టయింది. 'ఆంధ్ర to ఆంధ్ర via తెలంగాణ' అంటూ గంటా ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని... లేనిపక్షంలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మనవారే కదా... ఆయనకు ఫోన్ చేయవచ్చు కదా అని ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికింది.
గంటా చేసిన ట్వీట్ ఇదే:
"ఆంధ్ర to ఆంధ్ర via తెలంగాణ.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతికి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం.
ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన నేను... విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడి నుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు. విశాఖ - విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇదీ విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి" అని గంటా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై హైకమాండ్ సీరియస్ అయింది.