Bindu Madhavi: లౌక్య ఎంటర్టైన్మెంట్స్ ‘దండోరా’... వేశ్యగా బిందు మాధవి

- రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాణ సారథ్యంలో దండోరా చిత్రం
- మురళీకాంత్ దర్శకత్వం
- సెట్స్ పైకి అడుగుపెట్టిన బిందు మాధవి
లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ప్రస్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 25 రోజుల పాటు కంటిన్యూగా జరగనున్న ఈ షెడ్యూల్లో... విలక్షణ పాత్రలతో హీరోయిన్గా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న బిందు మాధవి భాగమయ్యారు. ఇందులో ఆమె వేశ్య పాత్రలో నటిస్తున్నారు. ఎమోషనల్ టచ్తో ఉంటూ ఆలోచింప చేసేలా ఆమె పాత్ర ఉంటుంది. ఇప్పటికే ఈ షెడ్యూల్లో వెర్సటైల్ యాక్టర్ శివాజీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిందు మాధవి కూడా జాయిన్ కావటం విశేషం.
ఫస్ట్ బీట్ వీడియోతో అంచనాలు పెంచుకున్న దండోరా సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో తెరకెక్కుతోంది. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండలు జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. విలక్షణ నటుడు శివాజీతో పాటు నవదీప్, నందు, బిందు మాధవి, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గతంలో నిర్మించిన కలర్ ఫొటో చిత్రానికి నేషనల్ అవార్డు లభించగా.... బెదురులంక 2012 చిత్రం విశేషంగా ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడదే ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ‘దండోరా’ చిత్రంపైనా భారీగా అంచనాలు నెలకొన్నాయి.
