Sourav Ganguly: వన్డే క్రికెట్ లో మరో కొత్త రూల్.. ఐసీసీ కమిటీ ప్రతిపాదన

––
వన్డే మ్యాచ్ లకు సంబంధించి ఐసీసీ మరో కొత్త రూల్ అమలులోకి తీసుకురానుందని సమాచారం. మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ కు ఒకే బంతిని వాడాలని ఐసీసీ కమిటీ తాజాగా ప్రతిపాదించింది. దీనిపై ఐసీసీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం వన్డే మ్యాచ్ లో ఒక్కో ఎండ్ కు రెండు బంతుల చొప్పున నాలుగు కొత్త బంతులు వాడుతున్నారు. మ్యాచ్ లో 25 ఓవర్ల తర్వాత బంతిని మారుస్తున్నారు. గతంలో మ్యాచ్ మొత్తం ఒకే బంతిని ఉపయోగించేవారు. దీనివల్ల బంతి పాతబడిన కొద్దీ బౌలర్లకు మరింత పట్టు లభించేది.
రివర్స్ స్వింగ్ తో పాటు స్పిన్నర్లకు కూడా బంతి అనుకూలించేది. ఈ రూల్ మార్చేశాక బ్యాటర్ల ఆధిపత్యం మొదలైంది. తాజాగా దీనికి అడ్డుకట్ట వేసేందుకు సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ ఓ కీలక ప్రతిపాదన చేసింది. ఒక్కో ఎండ్ లో కొత్త బంతి కాకుండా ఒక జట్టు ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకూ ఒకే బంతిని ఉపయోగించాలని సూచించింది. దీనిపై జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.