Revanth Reddy: రేవంత్ కు పౌరుషం లేదు... కేటీఆర్ ఓ బచ్చా: ధర్మపురి అర్వింద్

- తెలంగాణలో బీజేపీని అడ్డుకోవడం రాహుల్ వల్ల కూడా కాదన్న అర్వింద్
- కేటీఆర్ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా
- కేసీఆర్ కంటే రేవంత్ ప్రమాదకారి అని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీని అడ్డుకోవడం రేవంత్ వల్లే కాదు ఆయన బాస్ రాహుల్ గాంధీ వల్ల కూడా కాదని అన్నారు. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వము అనేది అంత ఈజీ కాదని... తెలంగాణలో బీజేపీ రావడం అనేది తమ చేతుల్లో ఉందని చెప్పారు.
కేటీఆర్ కు ఉన్నంత దమ్ము, ధైర్యం కూడా నీకు లేదని... నిన్ను జైల్లో వేసిన వారిని ఎందుకు జైలుకు పంపలేకపోతున్నావని రేవంత్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రేవంత్ కు రోషం, పౌరుషం లేదని అన్నారు. కేటీఆర్ ఓ బచ్చా అని... ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. హెచ్సీయూ భూములను కబ్జా చేసిన బీజేపీ ఎంపీ ఎవరో దమ్ముంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి అత్యంత ప్రమాదకారి అని... హైదరాబాద్ ను బేస్ మెంట్ తో సహా కూల్చివేయడం ఖాయమని అన్నారు.