Kolkata Knight Riders: పరుగుల వర్షం కురిసిన మ్యాచ్... లక్నోపై 4 పరుగుల తేడాతో ఓడిన కోల్ కతా

- ఈడెన్ గార్డెన్స్ హోరాహోరీగా సాగిన మ్యాచ్
- 4 పరుగుల తేడాతో ఓడిన కోల్ కతా
- మొదట 20 ఓవరలో 3 వికెట్లకు 238 పరుగులు చేసిన లక్నో
- ఛేదనలో 20 ఓవర్లలో 7 వికెట్లకు 234 పరుగులు చేసిన కేకేఆర్
ఈడెన్ గార్డెన్స్ లో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమిపాలైంది. హోరాహోరీ మ్యాచ్ లో కొద్దిలో గెలుపును చేజార్చుకుంది. 239 పరుగుల లక్ష్యఛేదనలో కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 234 పరుగులు చేయడం ఆ జట్టు పోరాట పటిమను చాటుతోంది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 81, నికోలాస్ పూరన్ 87, ఐడెన్ మార్క్రమ్ 47 పరుగులు చేశారు. అనంతరం, భారీ టార్గెట్ ఛేదించేందుకు బరిలో దిగిన కోల్ కతా జట్టు సొంతగడ్డపై జూలు విదిల్చింది.
కెప్టెన్ అజింక్యా రహానే 35 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 61 పరుగులు చేయగా... వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 41 పరుగులు చేసి అవుటయ్యాడు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (15) మరోసారి నిరాశపర్చినప్పటికీ... మరో ఓపెనర్ సునీల్ నరైన్ 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేసి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.
చివర్లో రింకూ సింగ్ పోరాడినా ఫలితం లేకపోయింది. రింకూ సింగ్ 15 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆఖరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 24 పరుగులు అవసరం కాగా, కోల్ కతా జట్టు 19 పరుగులే చేసి ఓటమిపాలైంది. రవి బిష్ణోయ్ విసిరిన ఆ ఓవర్లో రింకూ సింగ్ రెండు ఫోర్లు, 1 సిక్స్ కొట్టగా... హర్షిత్ రాణా ఒక ఫోర్ కొట్టాడు.
విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోవడంతో కోల్ కతా శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, శార్దూల్ ఠాకూర్ 2, అవేష్ ఖాన్ 1, దిగ్వేష్ రాఠీ 1, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు.