భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు

86 Maoists Surrender in Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల ప్రయత్నాలు ఫలించాయి. మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన 'ఆపరేషన్ చేయూత' ఫలితాలను ఇస్తోంది. ఈ ఆపరేషన్ నేపథ్యంలో, ఏకంగా 86 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన మావోయిస్టులు కూడా ఉన్నారు.

లొంగిపోయిన వారిలో 20 మంది మహిళా మావోయిస్టులు, 66 మంది పురుషులు ఉన్నారు. గత నాలుగు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 66 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, తాజాగా 86 మంది లొంగిపోయారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా 25 వేల రూపాయల చెక్కును ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... మావోయిస్టులు అజ్ఞాత జీవితాన్ని విడిచిపెట్టి, సాధారణ జీవితంలోకి రావాలని కోరారు. ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, ఇతర పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మావోయిస్టుల పేరుతో అమాయక ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై ఇటీవల కాలంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అంతేకాకుండా, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి మావోయిస్టుల కార్యకలాపాలు అడ్డుగా ఉన్నాయని గుర్తించి, వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ప్రయత్నాల ఫలితంగా గత నాలుగు నెలల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు.
Go Back to Shorts
Chandrasekhar Reddy
Maoists Surrender
Bhadradri Kothagudem
Operation Cheyuta
Telangana Police
Naxalites
Surrender of Maoists
Anti-Naxal Operation
Bijapur
Sukma

More Telugu News