భార్యకు దగ్గరుండి ప్రియుడితో పెళ్లి చేసిన భర్త.. వీడియో ఇదిగో!

  • ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌నగర్ జిల్లాలో ఘటన
  • భార్య వివాహేతర బంధాన్ని గుర్తించిన భర్త
  • పిల్లల బాధ్యత తాను చూసుకుంటానని భరోసా
  • శివాలయంలో ప్రియుడితో దగ్గరుండి మరీ వివాహం చేయించిన వైనం
ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో భార్యను అతడికే ఇచ్చి వివాహం చేశాడో భర్త. ఉత్తరప్రదేశ్‌లో సంత్ కబీర్ నగర్ జిల్లాలో జరిగిందీ ఘటన. పుట్టిన పిల్లల బాధ్యతను తానే చూసుకుంటానని చెప్పి దగ్గరుండి మరీ వివాహం జరిపించాడు. ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ కాగా, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కటర్ జూట్ గ్రామానికి చెందిన బబ్లూ 2017లో గోరఖ్‌పూర్‌కు చెందిన రాధికను వివాహం చేసుకున్నాడు. వీరికి ఆర్యన్ (7), శివానీ (2) ఇద్దరు పిల్లలు. ఉద్యోగ రీత్యా బబ్లూ నిత్యం కుటుంబానికి దూరంగా ఉండేవాడు. ఈ క్రమంలో స్థానిక యువకుడు వికాస్‌తో రాధికకు ఏర్పడిన పరిచయం వివాహేతర బంధానికి దారి తీసింది. వీరి రహస్య బంధాన్ని గమనించిన బబ్లూ కోపంతో ఊగిపోవడానికి బదులు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భార్యను ధనఘ్ట తహశీల్‌కు తీసుకెళ్లి అఫిడవిట్ తయారుచేయించాడు. ఆ తర్వాత దనీనాథ్ శివాలయంలో వికాస్‌తో తన భార్య వివాహాన్ని దగ్గరుండి జరిపించాడు. అంతేకాదు, పిల్లల బాధ్యతను తాను చూసుకుంటానని, ఆమె సంతోషంగా ఉంటే చాలని చెప్పడంతో పెళ్లికొచ్చిన వారు అతడి మంచి మనసుకు ఫిదా అయిపోయారు.

వికాస్‌తో దండలు మార్చుకుంటున్న సమయంలో రాధిక కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వివాహానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భార్య సంతోషం కోసం బబ్లూ చేసిన త్యాగాన్ని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఇదేం పిచ్చిపని అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


More Telugu News