పార్టీ మారుతున్నట్లు ప్రచారం... స్పందించిన పాడి కౌశిక్ రెడ్డి
- తాను పార్టీ మారబోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి స్పష్టీకరణ
- కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం
- తప్పుడు ప్రచారం చేసిన ఛానల్స్పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక
తనపై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్స్పై పరువు నష్టం దావా వేయనున్నట్లు వెల్లడించారు. తన చివరి క్షణం వరకు కేసీఆర్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడుతానని అబద్దపు ప్రచారం సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ తన కుటుంబం, కేసీఆరే తన నాయకుడు అన్నారు. ఎప్పటికీ ఆయన వెంటే ఉంటానని కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్తో, కేసీఆర్తో తన అనుబంధాన్ని ఎవరూ తెంచలేరని వ్యాఖ్యానించారు. తన ప్రజాదరణను చూసి కొంతమంది ఓర్వలేక, వారి ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తన రాజకీయ జీవితం కేసీఆర్తోనే అని స్పష్టం చేశారు.