హబ్సిగూడలో విషాదం.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిల్లలను చంపి ఉరేసుకున్న దంపతులు

  • ఏడాది క్రితం కల్వకుర్తి నుంచి హబ్సిగూడకు వచ్చిన కుటుంబం
  • ఆరు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో వెంటాడిన ఆర్థిక సమస్యలు
  • కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య
  • తన చావుకు ఎవరూ కారణం కాదంటూ కుటుంబ పెద్ద సూసైడ్ నోట్
హైదరాబాద్‌లోని హబ్సిగూడలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (44), కవిత (35) దంపతులు ఏడాది క్రితం హబ్సిగూడకు వచ్చారు. వీరికి విశ్వాన్‌రెడ్డి (10), శ్రీతరెడ్డి(15) సంతానం. 

చంద్రశేఖర్‌రెడ్డి కొంతకాలంపాటు ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి మానేశారు. ఆరు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడాయి. ఈ నేపథ్యంలో నిన్న కుమారుడు విశ్వాన్‌రెడ్డికి విషమిచ్చి, కుమార్తె శ్రీతరెడ్డికి ఉరివేసి చంపేశారు. ఆపై భార్యాభర్తలు ఇద్దరూ ఉరివేసుకున్నారు.

తన చావుకి ఎవరూ కారణం కాదని, వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను క్షమించాలంటూ చంద్రశేఖర్‌రెడ్డి రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కెరీర్‌ పరంగాను, శారీరకంగాను, మానసింగాను సమస్యలు ఎదుర్కొంటున్నానని, షుగర్, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు చంద్రశేఖర్‌రెడ్డి అందులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News