Priyanka Chopra: ముంబయిలోని ఫ్లాట్లను అమ్మేస్తున్న ప్రియాంక చోప్రా

- అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో స్థిరపడిన ప్రియాంక చోప్రా
- 16.17 కోట్లకు ముంబయిలోని ఆస్తుల విక్రయం
- రాజమౌళి తాజా చిత్రంలో నటిస్తున్న ప్రియాంక చోప్రా
ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్ను వివాహం చేసుకున్న తర్వాత లాస్ ఏంజిల్స్లో స్థిరపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆమె ఇక్కడ ఉన్న ఆస్తులను విక్రయిస్తున్నారు. తాజాగా కోట్ల రూపాయల డీల్ జరిగినట్లు ఇండెక్స్ ట్యాప్ వెల్లడించింది. ముంబయిలోని అంధేరిలో ఉన్న ఒబెరాయ్ స్కై గార్డెన్లో ప్రియాంకకు చెందిన నాలుగు ఫ్లాట్లను ఆమె ఏకంగా రూ.16.17 కోట్లకు విక్రయించారు.
గతంలో కూడా ప్రియాంక దేశంలోని పలు ఆస్తులను విక్రయించారు. 2021లో వెర్సోవాలోని రెండు ఇళ్లు, 2023లో లోఖండ్ వాలాలోని రెండు పెంట్ హౌస్లను ఆమె విక్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు గోవా, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్లో సొంత భవనాలు ఉన్నాయి. భర్త, కుమార్తెతో కలిసి ప్రియాంక లాస్ ఏంజిల్స్లో నివాసం ఉంటున్నారు.
ప్రియాంక సినిమాల విషయానికి వస్తే.. ఆమె హాలీవుడ్లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. కొంతకాలం క్రితం 'సిటాడెల్' అమెరికన్ వెర్షన్లో కథానాయికగా నటించారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న #SSMB29 సినిమాలో ప్రతినాయక పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు.
ఈ ప్రాజెక్టుతో ప్రియాంక చోప్రా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రాజమౌళి సినిమాలో కొన్ని రోజులపాటు ఆమె షూటింగ్లో పాల్గొన్నారు. తదుపరి షెడ్యూల్స్లో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్కు రావాల్సి ఉంటుంది. రాజమౌళి సినిమాలు పూర్తి కావడానికి సాధారణంగా ఒకటి లేదా రెండు సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇక్కడి ఆస్తులు విక్రయించినప్పటికీ ప్రియాంక చోప్రా కొంతకాలం హైదరాబాద్లో ఉండవలసిన అవసరం ఉంది.