Mahesh Babu: తమ సినిమా చూడాలని మహేశ్ బాబును కోరిన తమిళ దర్శకుడు

- హిట్ టాక్ ను సొంతం చేసుకున్న 'డ్రాగన్' మూవీ
- సక్సెస్ మీట్ జరుపుకున్న 'డ్రాగన్' టీమ్
- మహేశ్ బాబు ఈ సినిమా చూడాలని కోరిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోలీవుడ్ సినిమా 'డ్రాగన్' హిట్ టాక్ ను సంపాదించుకుంది. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
సినిమా విజయవంతం కావడంతో 'డ్రాగన్' మూవీ టీమ్ సక్సెస్ మీట్ జరుపుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ... ఇంతకు ముందు తన 'ఓ మై కడవులే' సినిమాను మహేశ్ బాబు చూసి ట్వీట్ చేశారని... దీంతో భారీ సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి తన సినిమా చూశారని తెలిపారు. ఇప్పుడు 'డ్రాగన్' సినిమాను కూడా మహేశ్ బాబు చూడాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన విన్నపం ఎవరి ద్వారా అయినా ఆయనకు చేరుతుందని నమ్ముతున్నానని అన్నారు.