అక్రమ నిర్మాణాల అంశం... ఈశా ఫౌండేషన్‌పై చర్యలు వద్దన్న సుప్రీంకోర్టు

  • పర్యావరణ అనుమతులు లేకుండా వెల్లియంగిరి ఈశా ఫౌండేషన్‌ను నిర్మించారని ఆరోపణలు
  • ఈశా ఫౌండేషన్‌కు నోటీసులు జారీ చేసిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు
  • కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులను కొట్టివేసిన హైకోర్టు
అక్రమ నిర్మాణాల అంశానికి సంబంధించి ఈశా ఫౌండేషన్‌పై ఎలాంటి బలవంతపు చర్యలను తీసుకోవద్దని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

తమిళనాడులోని వెల్లియంగిరిలో ఈశా ఫౌండేషన్ ఉంది. దీనిని అక్రమంగా, పర్యావరణ అనుమతులను తీసుకోకుండా నిర్మించినట్లు తమిళనాడు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆరోపించింది. ఈశా ఫౌండేషన్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నోటీసులపై ఫౌండేషన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. నిబంధనల ప్రకారమే నిర్మాణం జరిగినట్లు తెలిపింది.

ఈ తీర్పును కాలుష్య నియంత్రణ బోర్డు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శుక్రవారం నాడు అత్యున్నత న్యాయస్థానం దీనిపై విచారణ జరిపింది. యోగా, ధ్యాన కేంద్రం అన్నీ పర్యావరణ నిబంధనలు, కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలకు లోబడి నిర్మాణం జరిపినట్లు తెలిపింది. అంతేకాక, ఈ ఫౌండేషన్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని కాలుష్య నియంత్రణ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News