టాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై రాయుడు సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌... ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు!

  • భార‌త్‌, పాక్ మ్యాచ్‌లో వివాదానికి తెర‌దీసిన అంబ‌టి రాయుడు 
  • దాయాదుల పోరును వీక్షించడానికి దుబాయ్ వెళ్లిన తెలుగు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు
  • పెద్ద మ్యాచ్ ల్లో అయితే టీవీల్లో ఎక్కువ క‌నిపిస్తారు.. ప‌బ్లిసిటీ స్టంట్ అన్న రాయుడు
  • రాయుడిపై దుమ్మెత్తిపోస్తున్న ఆయా ప్ర‌ముఖుల అభిమానులు
నిన్న‌టి భార‌త్‌, పాక్ మ్యాచ్‌లో అంబ‌టి రాయుడు చేసిన కామెంట్రీ వివాదానికి తెర‌దీసింది. దాయాదుల పోరును వీక్షించడానికి తెలుగు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు దుబాయ్ వెళ్లారు. వారిలో ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి, ద‌ర్శ‌కుడు సుకుమార్ ఫ్యామిలీ, ఊర్వశీ రౌతెలా త‌దిత‌రులు ఉన్నారు. కెమెరాలు కూడా వాళ్లని బాగా ఫోకస్‌ చేశాయి. 

మ్యాచ్ జ‌రుగుతుండ‌గా స్క్రీన్‌పై సుకుమార్ క‌నిపించ‌గానే ప్రైడ్ ఆఫ్ తెలుగు అని ఓ కామెంటేట‌ర్ అన్నారు. అయితే, కామెంట్రీ బాక్సులో కూర్చున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌ అంబటి రాయుడు మాత్రం "ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌" అంటూ నోరు జారాడు.

రాయుడు మాట్లాడుతూ... "ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అయితే టీవీల్లో ఎక్కువ క‌నిపిస్తారు. ప‌బ్లిసిటీ స్టంట్" అని అన్నాడు. దీంతో ఆయా ప్ర‌ముఖుల అభిమానులు రాయుడిని ఏకిపారేస్తున్నారు. "ఇప్పుడు సుకుమార్‌ దేశం గర్వించదగిన‌ దర్శకుల్లో ఒక‌రు. ఆయన కోరుకొంటే ప్రతీ రోజూ టీవీల్లో కనిపించే అవకాశం ఉంది. పబ్లిసిటీ స్టంట్‌ కోసం ఖర్చు పెట్టుకుని దుబాయ్‌ వెళ్లాల్సిన అవసరం ఆయ‌న‌కు లేదు" అంటూ రాయుడిపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

ఇక మెగాస్టార్‌ చిరంజీవి చూడని పబ్లిసిటీ ఉందా? కెమెరా తనవైపు తిరగాలంటే ఆయన దుబాయ్‌ వరకూ వెళ్లాలా? ఈ విషయం రాయుడికి తెలియదా? అని క్రికెట్ అభిమానులు అతనిపై ఫైర్ అవుతున్నారు. తెలుగువాడై సాటి తెలుగువాళ్లపై ఇలాంటి చీప్‌ కామెంట్స్‌ చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు రాయుడిపై దుమ్మెత్తిపోస్తున్నారు. 


More Telugu News