ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదం: ఈ రాత్రికి శ్రీశైలం చేరుకోనున్న నేవీ బృందం

  • నిన్న ఉదయం కుప్పకూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్
  • 8 మంది గల్లంతు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కూలిపోవడం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది టన్నెల్ లో చిక్కుకుపోయారు. నిన్న ఉదయం నుంచి వారు అందులోనే ఉండిపోవడంతో, ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందన్నది అత్యంత ఆందోళన కలిగిస్తోంది. 

ఈ నేపథ్యంలో, సాధ్యమైనంత వేగంగా రెస్క్యూ ఆపరేషన్ ను ముందుకు తీసుకెళుతున్నారు. ఈ సాయంత్రానికి టన్నెల్ కూలిపోయిన ప్రాంతానికి 50 మీటర్ల దూరం వరకు సహాయక బృందాలు వెళ్లగలిగాయి. భారీగా మట్టి, బురద ఉండడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఘటన స్థలంలో 15 అడుగుల ఎత్తు వరకు బురద పేరుకుపోయినట్టు తెలుస్తోంది. 

కాగా, సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు నేవీ బృందం కూడా వస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ నిపుణులతో కూడిన నేవీ టీమ్ ఈ రాత్రికి శ్రీశైలం చేరుకోనుంది.

ప్రస్తుతం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.


More Telugu News