‘సంక్రాంతి’ నిలువు దోపిడీ.. ప్రయాణికులను అడ్డంగా దోచుకుంటున్న బస్సులు

Sankranti Passengers Was Tonsure By Private Travels
  • సాధారణ రోజులతో పోలిస్తే 50 శాతం అదనపు చార్జీల వసూలు
  • సీటుకో రేటు చొప్పున వసూలు చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్
  • తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లోనూ చార్జీల బాదుడు
  • పండుగ వేళ ప్రయాణికులకు క్షవరం
సంక్రాంతి పండుగకు ఊరెళ్లాలనుకున్న వారు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రైళ్లన్నీ ఫుల్ కావడంతో గత్యంతరం లేక ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్న వారి జేబులు ఖాళీ అవుతున్నాయి. మరోవైపు, బస్సులు కూడా ఫుల్ అయిపోవడంతో అదనపు సర్వీసుల పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. సీటుకో రేటు చొప్పున వసూలు చేస్తూ ప్రయాణికులకు సంక్రాంతి సంబరం లేకుండా చేస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రత్యేక సర్వీసుల పేరిట 50 శాతం చార్జీలను అదనంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్న వారు నిండా మునుగుతున్నారు. సాధారణ రోజుల్లో కేటగిరీని బట్టి రూ. 1200 నుంచి రూ. 3,500 ఉండే చార్జీలు ప్రస్తుతం రూ. 2,500 నుంచి రూ. 7 వేల వరకు పలుకుతున్నాయి.

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏసీ స్లీపర్ బస్సులో రూ. 4,239 నుంచి రూ. 6,239 వరకు వసూలు చేస్తున్నారు. అదే సాధారణ రోజుల్లో ఏసీ బస్సులో సీటర్ ధర గరిష్ఠంగా రూ. 1,849 ఉండగా ప్రస్తుతం రూ. 5,649 వరకు వసూలు చేస్తున్నారు. వోల్వోలాంటి బస్సుల్లో అయితే ఇది రూ. 6,609గా ఉంది. అదే విజయవాడకు అయితే గరిష్ఠంగా రూ.3,599 వరకు తీసుకుంటున్నారు.

మరోవైపు, ఆర్టీసీ బస్సుల్లోనూ అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వీటిలో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తోంది. సాధారణ రోజుల్లో ఏసీ స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు గరిష్ఠంగా రూ. 700 ఉండగా ప్రస్తుతం రూ. 1,050 తీసుకుంటున్నారు. లహరి ఏసీ బస్సుల్లో ఈ ధర రూ. 2,310గా ఉంది.
Go Back to Shorts
Sankranti 2025
TGSRTC
APSRTC
Bus Fares

More Telugu News