కవిత జైలుకు వెళ్లి వచ్చారు... ఇక కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: కడియం శ్రీహరి

Kadiyam Srihari hot comments on BRS leaders
  • కేసీఆర్ కుటుంబంలోని వారంతా నిజాయితీపరులైతే అన్ని కేసులు ఎందుకున్నాయని ప్రశ్న
  • 2014కు ముందు కేసీఆర్ ఆస్తులెన్ని? ఇప్పుడెన్ని? అని నిలదీత
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్, హరీశ్ రావు తప్పు చేశారని ఆరోపణ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారని, ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్ కూడా జైలుకు వెళతారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలోని వారంతా నిజాయితీపరులే అయితే ఒక్కొక్కరిపై అన్ని కేసులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. 

2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు కేసీఆర్, ఆయన కుటుంబంలోని వారి ఆస్తి ఎంత? ఇప్పుడు ఎంత? అని ప్రశ్నించారు. పదేళ్ల కాలంలో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్, హరీశ్ రావు ఎన్నో తప్పులు చేశారన్నారు.

ఎన్నో పథకాల్లో అక్రమాలు చేశారన్నారు. దళితబంధు, రైతుబంధులో ఎంతో అవినీతి జరిగిందన్నారు. దళితబంధులో కమిషన్ తీసుకొని ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని కడియం శ్రీహరి సవాల్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
Go Back to Shorts
Kadiam Srihari
K Kavitha
KTR
Congress

More Telugu News