తొక్కిసలాట జరిగిందని చెబితే, మన సినిమా హిట్టయినట్టే అన్నాడట... అల్లు అర్జున్ పై అక్బరుద్దీన్ ఫైర్

  • అసెంబ్లీలో అక్బరుద్దీన్ ప్రసంగం
  • అల్లు అర్జున్ పేరెత్తకుండా తీవ్ర విమర్శలు
  • తాము కూడా బహిరంగ సభలకు వెళుతుంటామని వెల్లడి
  • కానీ తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తపడతామని స్పష్టీకరణ 
ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పై పరోక్షంగా ధ్వజమెత్తారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిందని ఆ హీరోకు పక్కనున్న వాళ్లు చెప్పారని, అలాగైతే మన సినిమా హిట్టయినట్టేనని ఆ హీరో అన్నట్టు తనకు తెలిసిందని వెల్లడించారు. 

"నాకున్న సమాచారం మేరకు... ఆ హీరో థియేటర్ కు వచ్చి సినిమా చూస్తుంటే... బయట తొక్కిసలాట జరిగిందని పోలీసు అధికారులు వచ్చి ఆ హీరోకు చెప్పారు. ఒక మహిళ మృతి చెందిందని, ఒక బాలుడు కిందపడిపోయాడని వారు ఆ హీరోకు వివరించారు. దాంతో ఆ హీరో ఆనందంగా... ఇక మన సినిమా హిట్టయినట్టే అన్నాడట. 

ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది, ఆ పిల్లవాడు తీవ్ర గాయాల పాలయ్యాడు... అయినా గానీ ఆ హీరో థియేటర్లో కూర్చుని సినిమా చూస్తూనే ఉన్నాడు. థియేటర్ బయటికి వచ్చి కూడా వాహనం పైనుంచి చేయి ఊపుతూ వెళ్లాడంటే ఏమనాలి? ఇది మానవీయ వైఖరేనా? 

నేను కూడా బహిరంగ సభలకు హాజరవుతుంటాను... ఆ సభలకు వేలాదిగా ప్రజలు వస్తుంటారు... కానీ ఎక్కడా తొక్కిసలాట జరగకుండా జాగ్రత్త పడతాను. నా చుట్టూ ఉన్న సెక్యూరిటీ వాళ్లు ప్రజలను నెట్టివేయకుండా చూసుకుంటాను" అని అక్బరుద్దీన్ వివరించారు.

Akbaruddin Owaisi
Allu Arjun
Sandhya Theater Incident
MIM
Telangana Assembly Session

More Telugu News