రైతు రుణాలపై ఆర్బీఐ శుభవార్త
- వ్యవసాయ రుణ సదుపాయాన్ని పెంచిన ఆర్బీఐ
- రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంపు
- జనవరి 1 నుంచి నూతన నిబంధనలు అమలులోకి వస్తాయన్న ఆర్బీఐ
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తాజాగా ఆర్బీఐ స్పష్టం చేసింది. పంట సాగుకు రైతులు పెడుతున్న ఖర్చులను, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలిస్తూ ఆర్బీఐ ఈ పరిమితి పెంచుతూ వస్తోంది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం .. సాధారణంగా భూ యజమాని నుంచి ఎలాంటి పూచీకత్తు అడగకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాల్సి ఉన్నా క్షేత్ర స్థాయిలో ఇది అమలు కావడం లేదు. బ్యాంకులు ఎవరో కొందరికి మాత్రమే (డిపాజిట్లు ఉన్న రైతులకు) ఇలాంటి రుణాలు మంజూరు చేస్తూ ఆర్బీఐ నిబంధనలు పాటిస్తున్నట్లు బయటకు చెబుతుంటాయి.
దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలను తీసుకొని అప్పులపాలవుతున్నారు. ఇలాంటి వారికి అండగా ఉండేందుకే ఆర్బీఐ ఈ సదుపాయం కల్పిస్తోంది. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నందున రైతులకు రుణ సదుపాయం మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యల వల్ల చిన్న, సన్నకారు రైతులైన 86 శాతం మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది.