ఏపీ సెక్రటేరియట్‌ ఉద్యోగుల మందు పార్టీ.. ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిపై కేసు

Case Against Secretariat Employees Association Leader Venkatrami Reddy
  • వివాదంలో చిక్కుకున్న ఏపీ స‌చివాల‌య ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డి  
  • అనుమతి లేకుండా మద్యం పార్టీని నిర్వహించడంపై ఆయ‌న‌పై కేసు న‌మోదు
  • గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కొండపావులూరి గార్డెన్స్‌‌లో మందు పార్టీ 
  • వెంక‌ట్రామిరెడ్డికి  41ఏ నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ పోలీసులు  
ఏపీ స‌చివాల‌య ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా మద్యం పార్టీని నిర్వహించడంపై ఆయ‌న‌పై ఎక్సైజ్‌ అధికారులు కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మ‌ద్యం పార్టీ నిర్వ‌హించ‌డంతో ఆయ‌న‌పై కేసు న‌మోద‌యింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కొండపావులూరి గార్డెన్స్‌‌లో మందు పార్టీ చేసుకుంటున్నట్లు ఎక్సైజ్‌ పోలీసుల‌కు స‌మాచారం అందింది. దాంతో గురువారం రాత్రి 11 గంట‌ల‌కు త‌నిఖీలు నిర్వ‌హించారు. సచివాల‌య క్యాంటీన్ ఎన్నిక‌ల్లో ఉద్యోగుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు పార్టీ ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.    

ఎక్సైజ్ అధికారులు సోదాలు చేప‌ట్టిన స‌మ‌యంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు గార్డెన్‌లో ఏర్పాటు చేసిన టేబుళ్లపై మద్యం సేవిస్తూ కనిపించారు. పార్టీ ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు.. ఆయ‌న‌కు 41ఏ నోటీసులు ఇచ్చి పంపారు. కాగా, ఈ విందులో పరిమితికి మించి మద్యాన్ని సమకూర్చారు. 

అయితే, ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇలాంటి మందు పార్టీల ఏర్పాటుకు ముందుగా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ, ఇక్క‌డ ఎలాంటి అనుమ‌తి లేకుండా మద్యం పార్టీని నిర్వహించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులే ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ దాడుల్లో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సూర్యనారాయణ, గుంటూరు ఎక్సైజ్ ఏఈఎస్ మరియబాబు, సీఐలు వీరాంజ‌నేయులు, న‌య‌న‌తార, ర‌మేశ్‌తో పాటు 20 మంది సిబ్బంది పాల్గొన్నారు.
Go Back to Shorts
Venkatrami Reddy
AP Secretariat
Secretariat Employees
Andhra Pradesh

More Telugu News