ఢిల్లీలో దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర తదుపరి సీఎంపై ఉత్కంఠ

Maharashtra Deputy CM Devendra Fadnavis arrives at Delhi airport
  • ఫలితాలు వెలువడి నాలుగు రోజులు 
  • సీఎం పీఠంపై ఇంకా కుదరని ఏకాభిప్రాయం
  • బీజేపీ హైకమాండ్‌తో చర్చలకు హస్తిన చేరిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు అవుతోంది. శనివారం జరిగిన కౌంటింగ్‌లో అధికార మహాయుతి కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది. అయితే తదుపరి సీఎం ఎవరనేదానిపై కూటమిలో ఇంతవరకు ఏకాభిప్రాయం కుదరలేదు. కూటమిలో అత్యధిక సీట్లు సాధించిన బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పీఠం కావాలని పట్టుబడుతున్నారు. సీఎం పదవిని తానే కొనసాగిస్తానంటూ ఏక్‌నాథ్ షిండే భీష్మించుకున్నారు. దీంతో మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే దానిపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. 

నిజానికి సోమవారమే నూతనం ప్రభుత్వం ఏర్పాటవుతుందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ హైకమాండ్‌తో చర్చించేందుకు సోమవారం రాత్రి హస్తిన చేరుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి పీఠంపై ఏమైనా స్పష్టత వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

సీఎం పీఠం కోసం షిండే శివసేన పట్టు
ముఖ్యమంత్రిగా తిరిగి షిండేను కొనసాగించాలని శివసేన పట్టుబడుతోంది. ఇందుకు బీహార్ నమూనాను ఆ పార్టీ నేతలు ఉదహరిస్తున్నారు. బీహార్‌లో బీజేపీ సంఖ్యాబలంతో సంబంధం లేకుండా జేడీయూ నేత నితీశ్ కుమార్‌కు సీఎంగా మద్దతు ఇస్తున్నట్టుగానే షిండేను బలపరచాలని అంటున్నారు. సీఎంగా షిండే సారథ్యంలోనే కూటమి ఘనవిజయం సాధించిందని గుర్తు చేస్తున్నారు. కాగా దేవేంద్ర ఫడ్నవీస్‌కు సీఎం పదవిని ఇవ్వాలని మహారాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. ఇదిలావుంచితే సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌కు అజిత్ పవార్ ఎన్సీపీ మద్దతిస్తోంది.
Go Back to Shorts
Maharashtra
Devendra Fadnavis
Eknath Shinde
shiva sena
BJP

More Telugu News