లా విద్యార్థినిపై అత్యాచారం కేసు... నలుగురు నిందితుల అరెస్ట్

విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వంశీతో పాటు అతడి స్నేహితులు ఆనంద్, జగదీశ్, రాజేశ్‌లను పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. నిందితుల్లో ముగ్గురు లా చదువుతుండగా, మరొకరు ఓ ప్రైవేటు మోటార్స్ కంపెనీలో క్యాషియర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలిని ప్రేమ, పెళ్లి పేరుతో వంశీ దగ్గరై నమ్మించి మోసం చేశాడు. వంశీ ఆమెపై లైంగిక దాడి చేయడంతో పాటు తన స్నేహితులతో కలిసి కూడా అత్యాచారం చేశాడు. ఈ ఘటన కలకలం రేపింది.

బాధితురాలు మధురవాడలోని ఎన్వీపీ లా కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. తన సహచర విద్యార్థి వంశీతో స్నేహం చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వంశీ... గత ఆగస్ట్ 10న ఆమెను కంబాలకొండకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అదే నెల 13న తన స్నేహితుడు ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేశ్, జగదీశ్ కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ తర్వాత ఆమెను బెదరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు.

Crime News
Andhra Pradesh
Visakhapatnam District

More Telugu News