హైకోర్టు ఆదేశాలతో.. నేడు పోలీసు విచారణకు హాజరవుతున్న రామ్ గోపాల్ వర్మ

  • చంద్రబాబు, పవన్, లోకేశ్ ల ఫొటోలు మార్ఫింగ్ చేసిన వర్మ
  • వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత రామలింగం
  • ఒంగోలు రూరల్ పీఎస్ లో విచారణకు హాజరవుతున్న వర్మ
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు పోలీసు విచారణకు హాజరవుతున్నారు. ఒంగోలు రూరల్ పీఎస్ లో ఆయనను ఈ ఉదయం 11 గంటలకు పోలీసులు విచారించనున్నారు. గత ఎన్నికలకు ముందు 'వ్యూహం' సినిమా ప్రమోషన్లలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ల ఫొటోలు మార్ఫింగ్ చేసి... వారిని కించపరిచేలా సోషల్ మీడియాలో ఫొటోలను పెట్టారంటూ వర్మపై మద్దిపాడు మండల టీడీపీ నేత రామలింగం మద్దిపాడు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. 

అయితే, తనను అరెస్ట్ నుంచి రక్షించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టును రామ్ గోపాల్ వర్మ ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను నిన్న విచారించిన హైకోర్టు... వర్మ విన్నపాన్ని తిరస్కరించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. అరెస్ట్ చేయవద్దంటూ తాము ఆదేశాలు ఇవ్వలేవని తెలిపింది. పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. వర్మ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో, ఈరోజు పోలీసు విచారణకు వర్మ హాజరవుతున్నారు.

Ram Gopal Varma
Tollywood

More Telugu News