మేం డ్రగ్స్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇచ్చాం... బీఆర్ఎస్ నేతలూ ఇవ్వాలి: కాంగ్రెస్ నేతలు

Congress leaders says BRS leaders should give samples for drug tests
  • హైదర్‌గూడ ఆసుపత్రిలో డ్రగ్స్ పరీక్షల కోసం శాంపిల్స్ ఇచ్చామన్న కాంగ్రెస్ నేతలు
  • కౌశిక్ రెడ్డి డ్రగ్స్ టెస్ట్ కోసం వస్తామని చెప్పి రాలేదన్న కాంగ్రెస్ నేతలు
  • రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణలు వస్తే నిరూపించుకోవాలని హితవు
డ్రగ్స్ పరీక్షలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. డ్రగ్స్ టెస్ట్ కోసం తాము శాంపిల్స్ ఇచ్చామని, దమ్ముంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. హైదర్‌గూడ అపోలో ఆసుపత్రిలో డ్రగ్స్ నిజనిర్ధారణ కోసం యూరిన్, డీవోఏ డ్రగ్ ప్యానల్ శాంపిల్స్ ఇచ్చినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు డ్రగ్స్ టెస్ట్ కోసం వస్తామని చెప్పి కూడా రాలేదని విమర్శించారు. కేటీఆర్, కౌశిక్ రెడ్డి ఇటీవలి కాలంలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఉందని, అందుకే శాంపిల్స్ ఇచ్చేందుకు రాలేదని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణలు వస్తే నిరూపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందన్నారు.

కేటీఆర్ బావమరిది జరిపిన విందులో ఒకరికి పాజిటివ్ వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చడానికి ముఖ్యమంత్రి ముందుకు వెళుతుంటే, బీఆర్ఎస్ నాయకులు ఈ వాతావరణాన్ని పాడు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మిత్రులతో కలిసి హైదరాబాద్‌ను డ్రగ్స్ సిటీగా మార్చే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని... నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
Go Back to Shorts
BRS
Congress
Telangana
Drugs

More Telugu News