‘కంగువ’ సినిమా ఎడిటర్ నిషాద్ అనుమానాస్పద మృతి

Kanguva editor Nishad Yusuf found dead at Kochi home
  • కొచ్చిలో తన నివాసంలో విగతజీవిగా కనిపించిన 43 ఏళ్ల నిషాద్
  • నిషాద్ మృతికి కారణం తెలియాల్సి ఉందన్న పోలీసులు
  • 2022లో ‘తల్లుమాల’ సినిమాకు ఉత్తమ ఎడిటర్‌గా అవార్డు
తమిళ నటుడు సూర్య హీరోగా రూపొందిన ‘కంగువ’ సినిమాకు ఎడిటర్‌గా పనిచేసిన నిషాద్ యూసుఫ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లో ఉంటున్న 43 ఏళ్ల నిషాద్ తన నివాసంలో ఈ తెల్లవారుజామున విగతజీవిగా కనిపించారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. 

మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమలో పాప్యులర్ ఎడిటర్‌గా పేరు సంపాదించుకున్న నిషాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమలో విషాదం నింపిందని ‘ది ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ డైరెక్టర్స్ యూనియన్’ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో సంతాపం తెలిపింది. 2022లో విడుదలైన ‘తల్లుమాల’ సినిమాకు గాను నిషాద్ ఉత్తమ ఎడిటర్‌గా కేరళ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం మమ్ముట్టి హీరోగా రూపొందుతున్న ‘బాజూకా’ సినిమాకు నిషాద్ పనిచేస్తున్నారు. కాగా, నిషాద్ ఎడిటర్‌గా పనిచేసిన కంగువ సినిమా వచ్చే నెల 14న విడుదల కానుంది.
Advertisement
Nishad Yusuf
Kanguva
Kochi
Kerala

More Telugu News