Nara Lokesh: ఈవీ రంగానికి అనంతపురం వ్యూహాత్మక ప్రదేశం..పెట్టుబడులు పెట్టండి: ఏపీ మంత్రి లోకేశ్‌

Minister Nara Lokesh Meet Tesla CFO Vaibhav Taneja

  • టెస్లా కేంద్ర కార్యాలయంలో సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో మంత్రి లోకేశ్‌ భేటీ
  • స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాల‌ని టెస్లాకు మంత్రి పిలుపు
  • పరిశ్రమలకు అనుకూలమైన సులభతరమైన విధానాలు ఏపీలో అమలు చేస్తున్నామ‌న్న లోకేశ్‌

ఆస్టిన్ లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో జగజ్జేతగా ఉన్న టెస్లా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా సీఎఫ్ఓ వైభవ్ తనేజా మాట్లాడుతూ... ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్, బ్యాటరీ స్టోరేజిలో తమ సంస్థ గ్లోబల్ లీడర్ గా ఉందని తెలిపారు. ఇంటి నుండి గ్రిడ్ వరకు బ్యాటరీ పవర్ స్టోరేజి పరికరాలు, సోలార్ ప్యానల్స్, సోలార్ షింగిల్స్, డ్రైవింగ్ ఇన్నొవేషన్, మోడల్ -3, పవర్ వాల్ వంటి ఉత్పత్తుల ద్వారా ఇంధనరంగంలో స్థిరమైన వృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. గతేడాది 18.8 శాతం వృద్ధి సాధించి 832 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో 97 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. 

మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంతో 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. తమ లక్ష్యసాధనకు టెస్లా వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల సహాయ, సహకారాలు అవసరమని అన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశార‌ని గుర్తు చేశారు. కియా, హీరో మోటార్స్ వంటి కంపెనీలను రాష్ట్రానికి రప్పించార‌ని తెలిపారు. 

ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ రంగాలపై బాబు దృష్టిసారించారని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా టెస్లా ఈవీ తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుంద‌న్నారు. ప్రగతిశీల నాయకత్వంలో పరిశ్రమలకు అనుకూలమైన సులభతరమైన విధానాలు ఏపీలో అమలు చేస్తున్నామ‌న్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా సౌరశక్తి నిల్వ వ్యవస్థలు, ముఖ్యంగా స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణకు సౌర ఫలకాలను అమర్చడంలో భాగస్వామ్యం కావాల‌ని ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ ఆశయాలకు అనుగుణంగా రెన్యువబుల్ ఎనర్జీపై దృష్టిసారిస్తే సహకారం అందిస్తామ‌ని తెల‌పారు. ఏపీ రాబోయే డేటా సెంటర్, ఐటీ హబ్‌లకు వినూత్న బ్యాటరీ పవర్ స్టోరేజి పరిష్కారాలు అవసరం అని పేర్కొన్నారు. 

అందుకే టెస్లా ఏపీకి వస్తే ఈ రంగంలో కీలకపాత్ర వహించే అవకాశం ఉంటుంద‌న్నారు. రాష్ట్రవ్యాప్త ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, సూపర్‌చార్జింగ్ టెక్నాలజీ అమలులో భాగస్వామ్యం కావాల‌న్నారు. ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్‌లో కీలక పాత్ర పోషిస్తూ, స్థిరమైన ఇంధన పరిష్కారాలపై దృష్టి సారించిన టెస్లా... ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట ప్రతినిధి బృందం సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్ వర్మ ఉన్నారు.

Nara Lokesh
Tesla CFO
Vaibhav Taneja
Andhra Pradesh
Tesla
  • Loading...

More Telugu News