అర్ధరాత్రి తర్వాత తీరం దాటిన ‘దానా’ తుపాను

  • తీరాన్ని తాకే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు
  • ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలు
  • ఇవాళ ఉదయానికి బలహీనమవుతుందని ఐఎండీ అంచనా
ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను కలవరపరిచిన తీవ్ర తుపాను ‘దానా’ ఎట్టకేలకు తీరం దాటింది. గురువారం అర్ధరాత్రి తర్వాత తీరాన్ని తాకింది. ఒడిశాలోని బిత్తర్‌కని నేషనల్ పార్క్, ధమ్రా మధ్య తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. తీరాన్ని తాకే సమయంలో భద్రక్‌, కేంద్రపార జిల్లాల్లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన ఈదురు గాలులు వీచాయని తెలిపింది. గాలుల తీవ్రతకు పలుచోట్ల చెట్లు కూలిపోయాయని పేర్కొంది. ఇవాళ (శుక్రవారం) ఉదయానికి తుపాన్‌ బలహీనపడుతుందని పేర్కొంది. 

కాగా తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. తీవ్రత దృష్ట్యా అధికారులు ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ఏకంగా 400లకు పైగా రైళ్లు రద్దు అయ్యాయి. కోల్‌కతా, భువనేశ్వర్‌ ఎయిర్‌పోర్ట్‌ల్లో సేవలను గురువారం సాయంత్రం నుంచి నిలిపివేశారు. శుక్రవారం 9 గంటల వరకు మూసి ఉంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తుపాను తీవ్రత దృష్ట్యా ప్రభావిత తీర ప్రాంతాల్లోని లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రెండు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కాగా దానా తుపాను వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన విషయం తెలిసిందే.

Cyclone Dan
Odisha
West Bengal
IMD

More Telugu News