Supreme Court: తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వివాదంపై విచార‌ణ‌.. స్వతంత్ర సిట్ కు సుప్రీంకోర్టు ఆదేశం

Supreme Court Key Decision on Tirumala Lauddu Adulteration Issue
  • సిట్ విచార‌ణ‌పై ఎలాంటి సందేహాలు లేవ‌న్న సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్
  • స్వతంత్ర ద‌ర్యాప్తు జ‌రిగితే మంచిదేన‌న్న అత్యున్న‌త న్యాయ‌స్థానం
  • సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు స‌భ్యుల‌తో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు ఆదేశం  
తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచార‌ణలో భాగంగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ విషయంలో సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ తో విచార‌ణ జరిపించాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ రోజు ఉదయం విచారణ చేపట్ట‌గా ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది.
 
సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలా అన్న విషయంపై సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ‌తా అభిప్రాయం కోరిన విష‌యం తెలిసిందే. దీంతో సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ సిట్ విచార‌ణ‌పై త‌మ‌కు ఎలాంటి సందేహాలు లేవు అని అన్నారు. అయితే, సిట్‌పై ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. 

ఇక స్వతంత్ర ద‌ర్యాప్తు జ‌రిగితే మంచిదేన‌ని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో  ద‌ర్యాప్తు సంస్థ‌లో ఐదుగురు స‌భ్యులు ఉండాల‌ని తెలిపింది. ఇందులో సీబీఐ నుంచి ఇద్ద‌రు, రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఇద్ద‌రితో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక నిపుణుడు ఉండాల‌ని న్యాయమూర్తులు పేర్కొన్నారు. 

బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రచయిత సంపత్ విక్రమ్, ఓ టీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు చౌహాన్కే దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు విచారణ జ‌రిపింది.
Order Copy

More Telugu News

Supreme Court
Tirumala Lauddu
Andhra Pradesh
TTD