పని ఒత్తిడిపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు... మండిపడిన కాంగ్రెస్

Congress lashes out at Nirmala Sitharaman for her stress management lessons
  • విద్యార్థులకు విద్యతో పాటు పని ఒత్తిడి నిర్వహణపై కూడా బోధన జరగాలన్న నిర్మల
  • కార్పొరేట్లకు ఇబ్బంది వచ్చినప్పుడే ఆర్థికమంత్రి పట్టించుకుంటారని కాంగ్రెస్ విమర్శ
  • పని విధానం, సుదీర్ఘ పని గంటలు వంటి అంశాల గురించి మాట్లాడాలన్న శివసేన
విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు పని ఒత్తిడి నిర్వహణ మీద బోధన జరగాల్సి ఉందని, సీఏ చదివిన యువతి పని ఒత్తిడిని భరించలేకపోయిందన్న వార్త తనను కలచివేసిందన్నారు. అయితే నిర్మలా సీతారామన్ ఏ కంపెనీ పేరు, యువతి పేరును ప్రస్తావించలేదు. కానీ ఇటీవల యర్నెస్ట్ యంగ్ ఇండియా ఉద్యోగి మరణాన్ని ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు విద్యతో పాటు పని ఒత్తిడిని జయించడాన్ని కూడా విద్యా సంస్థలు బోధించాలన్నారు.

ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న పని పరిస్థితుల గురించి మాట్లాడకుండా... పని ఒత్తిడిని జయించడం గురించి మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ పేర్కొంది. కార్పొరేట్లకు ఇబ్బంది వచ్చినప్పుడే ఆర్థికమంత్రి పట్టించుకుంటారని, కార్పొరేట్ శ్రమ దోపిడీకి గురైన అన్నాసెబాస్టియన్ వంటి వారి బాధలు పట్టవని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి... ఆమెదే తప్పన్నట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. 

క్లిష్టమైన కోర్సుల్లో ఒకటైన చార్టర్డ్ అకౌంటెన్సీ చేసిన యువతికి పని ఒత్తిడి గురించి చెప్పాల్సిన అవసరం లేదని శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. పని విధానం, సుదీర్ఘ పని గంటలు వంటి అంశాల గురించి ఆర్థికమంత్రి మాట్లాడాలని హితవు పలికారు. సున్నిత అంశాల పట్ల ఆచితూచి మాట్లాడాలన్నారు.
Advertisement
Congress
Nirmala Sitharaman
BJP
Employees

More Telugu News