భోపాల్ వనవిహార్‌కే అందాన్ని తెచ్చిపెట్టిన తెల్ల ఆడపులి మృతి

  • కొంతకాలంగా ఆహారం తీసుకోవడం మానేసిన రిద్ధి
  • వయసు మీద పడడంతో ఆర్గాన్ ఫెయిల్యూర్ 
  • మృతికి అదే కారణమన్న పార్క్ అధికారులు
భోపాల్‌లోని వనవిహార్ నేషనల్ పార్క్‌కే అందాన్ని తెచ్చిపెట్టిన తెల్ల ఆడపులి రిద్ధి మృతి చెందింది. ఎన్‌క్లోజర్‌లో కనువిందు చేసిన ఈ పులి మరణం జంతు ప్రేమికులు, వన విహార్‌ నేషనల్ పార్క్‌ను సందర్శించే వారికి తీరని ఆవేదన మిగిల్చింది. రిద్ధి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని, నిన్న అది ఎన్‌క్లోజర్ వద్ద మృతి చెంది కనిపించిందని పార్క్ అధికారులు తెలిపారు. 

కొన్ని రోజులుగా అది ఆహారం తీసుకోవడం కూడా మానేసిందని, దీంతో రిద్ధిని అబ్జర్వేషన్‌లో పెట్టినట్టు అధికారులు పేర్కొన్నారు. అయినప్పటికీ అది చలాకీగానే కనిపించిందని తెలిపారు. మార్పిడి కార్యక్రమంలో భాగంగా రిద్ధిని 28 డిసెంబర్ 2013లో ఇండోర్ జూపార్క్ నుంచి భోపాల్ వనవిహార్‌కు తీసుకొచ్చారు. అప్పట్లో దాని వయసు 4 సంవత్సరాలు. ప్రస్తుతం 15 ఏళ్లు. 

వయసు మీద పడడంతో అవయవాలు పనిచేయకపోవడం వల్లే రిద్ధి మరణించిందని అధికారులు తెలిపారు. దాని నమూనాలను జబల్‌పూర్‌లోని వైల్డ్ లైఫ్ ఫోరెన్సిక్ హెల్త్ స్కూల్‌కు పంపారు. పోస్టుమార్టం అనంతరం పులిని ఖననం చేశారు. అడవిలో నివసించే పులులు సాధారణంగా 15 నుంచి 16 ఏళ్ల వరకు జీవిస్తాయి. అయితే, జూ వంటి సంరక్షణ ప్రాంతాల్లో వాటి జీవితకాలం కొంత ఎక్కువగా ఉంటుంది. వనవిహార్ నేషనల్ పార్క్‌లో ప్రస్తుతం 15 పులులు మాత్రమే ఉన్నాయి.

White Tigress Riddhi
Madhya Pradesh
Bhopal
Van Vihar

More Telugu News