వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు

RBI governor signals no policy change
  • ద్రవ్యోల్బణం తగ్గుతుండంతో వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు
  • వడ్డీ రేట్ల తగ్గింపుపై తాము తొందరపడటం లేదన్న శక్తికాంతదాస్
  • ఇతర కేంద్ర బ్యాంకులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచన
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లను తగ్గిస్తుందా? అంటే, అందుకు తొందరపడం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటంతో యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాల ఉన్నాయి. దీంతో భారత్ కూడా వడ్డీ రేట్లను తగ్గించవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో... సింగపూర్‌లో నిర్వహించిన 'ఫ్యూచర్ ఆఫ్ ఫైనాన్స్ ఫోరమ్ 2024'లో పాల్గొన్న శక్తికాంతదాస్ మాట్లాడుతూ... ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పటికీ వడ్డీ రేట్లను తగ్గించేందుకు తాము తొందరపడటం లేదన్నారు. ద్రవ్యోల్బణం 2-6 శాతం మధ్య ఉంచాలన్న తమ లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. అయితే తమ లక్ష్యం 4 శాతంగా ఉందన్నారు. పరపతి విధాన సమీక్ష నిర్ణయాలలోనూ దీనిపై చర్చించామన్నారు.
 
ద్రవ్యోల్బణం అంశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశీయ వృద్ధిలో ప్రైవేటు వినియోగం, పెట్టుబడులది కీలకపాత్ర అన్నారు. కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం నుంచి బయటపడి వేగంగా పుంజుకుందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం జీడీపీ వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ రుణాలు పెరగడంపై శక్తికాంతదాస్ ఆందోళన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
RBI
Shaktikantha Das
Interest Rate

More Telugu News