వారణాసిలో ఏపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ముల ఆత్మహత్య

  • వారణాసిలో ఆంధ్రా ఆశ్రమంలో లక్ష్మీనారాయణ, వినోద్ బలవన్మరణం
  • మృతుల స్వస్థలం ఏలూరు జిల్లా ఉంగుటూరు
  • రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారాల్లో భారీ నష్టం
  • కొందరు చేసిన మోసం వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్న సెల్ఫీ వీడియో
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో ఏపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వారిద్దరినీ ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన లక్ష్మీనారాయణ, వినోద్ గా గుర్తించారు. వారణాసిలోని ఆంధ్రా ఆశ్రమంలో వారు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 

ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొందరు వ్యక్తులు తమను బెదిరిస్తున్నారని ఆ సోదరులు సెల్ఫీ వీడియో రికార్డు చేసి, బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ ఆత్మహత్యకు వీరే కారణం అంటూ ఆ సెల్ఫీ వీడియోలో కొందరు పేర్లను పేర్కొన్నారు. సెల్ఫీ వీడియోను ఆ అన్నదమ్ములు వారి బంధువులకు పంపించినట్టు తెలుస్తోంది. మృతుల మొబైల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా నారాయణపురంలోని వారి బంధువులకు వారణాసి పోలీసులు సమాచారం అందించారు. 

కాగా, లక్ష్మీనారాయణ, వినోద్ ఏప్రిల్ నెలలోనే ఇంటి నుంచి వెళ్లిపోగా, చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు కూడా నమోదైనట్టు వెల్లడైంది. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారాల్లో తీవ్రంగా నష్టపోవడంతో వారు ఇల్లు వదిలి వచ్చేసినట్టు తెలుస్తోంది. వారి తల్లిదండ్రులు కొద్దికాలం కిందటే చనిపోయారు. 

లక్ష్మీనారాయణ, వినోద్ ల బలవన్మరణంపై సమాచారం అందుకున్న బంధువులు వారణాసి వెళ్లనున్నారు. ఆ ఇద్దరు సోదరుల అంత్యక్రియలు వారణాసిలోనే నిర్వహించనున్నారు. 



More Telugu News

Suicide Lakshmi Narayana Vinod Varanasi Eluru District Andhra Pradesh