వరద నష్టంపై ప్రకటన చేసిన ఏపీ ప్రభుత్వం

  • ఏపీలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు, వరదలు
  • 45 మంది చనిపోయారని వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం
  • అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడి
  • మొత్తం 6.44 లక్షల మందిపై వరద ప్రభావం పడినట్టు వివరణ
ఏపీలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రకటన చేసింది. వరదల కారణంగా 45 మంది చనిపోయారని ఆ ప్రకటనలో వెల్లడించింది. 

ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 35 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. గుంటూరు జిల్లాలో ఏడుగురు, ఏలూరు జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు మరణించినట్టు వివరించింది. 

ఇక, రాష్ట్రవ్యాప్తంగా 6.44 లక్షల మందిపై వరద ప్రభావం పడినట్టు వెల్లడించింది. 246 పునరావాస శిబిరాల్లో 49 వేల మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. 

వరదల కారణంగా 3,913 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, 20 జిల్లాల్లో 1.81 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం పేర్కొంది. 12 జిల్లాల్లో 19 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు వెల్లడించింది.


More Telugu News

Flood Damage Victims AP Govt Statement