అర్హత కలిగిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి

అర్హత కలిగిన యువత అంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. జనవరి 1 నాటికి పద్దెనిమిదేళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. 

ఆయన నేడు మాట్లాడుతూ... ఆగస్ట్ 20న ప్రారంభమైన ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అక్టోబర్ 29 నాటికి డ్రాఫ్ట్‌ను ప్రకటిస్తామన్నారు. నవంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరించి, వచ్చే జనవరి 6న తుది జాబితాను ప్రచురిస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,33,27,304 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 8 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వాటిలో 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలకు ఇప్పటికే శిక్షణ పూర్తయిందని తెలిపారు. అలాగే ఓటరు కార్డు, ఆధార్ లింక్ దాదాపు 60 శాతం పూర్తయినట్లు చెప్పారు.


More Telugu News