రజనీకాంత్ గారూ... మీ మౌనాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు: రాధిక

మలయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై కేరళ ప్రభుత్వానికి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక కలకలం రేపింది. ఈ నివేదిక ఇతర సినీ పరిశ్రమల్లో సైతం సంచలనం రేపుతోంది. ఈ నివేదిక గురించి స్పందించాలని ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఓ ప్రెస్ మీట్ లో ప్రశ్నించగా... ఆ రిపోర్ట్ గురించి తనకేమీ తెలియదని చెప్పారు.

రజనీకాంత్ వ్యాఖ్యలపై తాజాగా సీనియర్ నటి రాధిక స్పందించారు. జస్టిస్ హేమ రిపోర్ట్ గురించి రజనీకాంత్ కు తెలిసి ఉంటే ఆయన కచ్చితంగా స్పందించేవారని చెప్పారు. నివేదిక గురించి ఆయనకు తెలియకపోవడం వల్లే మాట్లాడలేదని అన్నారు. "రజనీ సార్.. మీ మౌనాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు" అని కూడా ఆమె వ్యాఖ్యానించారు.

అగ్రనటులు హేమ నివేదికపై మాట్లాడాలని... స్టార్ హీరోల మాటలు మహిళా నటులకు ఉపశమనాన్ని ఇస్తాయని అన్నారు. తమిళ అగ్ర నటుల్లో చాలా మందికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని... సమాజం కోసం వారు చాలా కష్టపడుతున్నారని... తోటి నటీమణులకు కూడా వారు మద్దతు ఇవ్వాలని రాధిక కోరారు.


More Telugu News