వైసీపీకి గుడ్ బై చెపుతున్నారా?... ఆర్ కృష్ణయ్య ఏమన్నారు?

వైసీపీకి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వాలకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా వైసీపీకి గుడ్ బై చెపుతారనే ప్రచారం జరుగుతోంది. 

ఈ ప్రచారంపై ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ... పదవులు, ఆర్థిక అవసరాల కోసమే కొందరు వైసీపీని వీడుతున్నారని... వాళ్ల మాదిరి తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పారు. జగన్ తనను గౌరవించారని... అందుకే తొలి నుంచి ఆయనకు మద్దతుగా ఉన్నానని అన్నారు. బీసీల కోసం కొట్లాడమనే ఆయన తనను రాజ్యసభకు పంపించారని చెప్పారు. తాను చివరి వరకు వైసీపీలోనే ఉండి బీసీల కోసం కొట్లాడతానని చెప్పారు. 

సొంత వ్యాపారాలు, స్వప్రయోజనాల కోసం కొందరు పార్టీలు మారుతుంటారని... వారి మాదిరి పార్టీలు మారాల్సిన అవసరం తనకు లేదని కృష్ణయ్య అన్నారు. తన బీసీ సంఘమే తనకు పార్టీ అని చెప్పారు. 


More Telugu News