23 గంటలకు పైగా.... ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ పై సీబీఐ ప్రశ్నల వర్షం

  • కోల్ కతాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం
  • ఆత్మహత్య అని ఆసుపత్రి వర్గాలు పేర్కొనడంపై సీబీఐ దృష్టి
  • మాజీ ప్రిన్సిపాల్ ను ఒక రోజంతా విచారించిన వైనం
కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఓ జూనియర్ డాక్టర్ పై హత్యాచారం జరిగిన ఘటనలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను సీబీఐ అధికారులు 23 గంటలకు పైగా ప్రశ్నించారు. శుక్రవారం మధ్యాహ్నం మొదలైన విచారణ... శనివారం కూడా కొనసాగింది. 

అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో ఆయనకు సీబీఐ అధికారులు స్వల్ప విరామం ఇచ్చారు. ఆ సమయంలో సందీప్ ఘోష్ తన నివాసానికి వెళ్లి వచ్చారు. వచ్చేటప్పుడు ఆయన చేతిలో కొన్ని ఫైళ్లు కనిపించాయి. 

కాగా, తమ కుమార్తె కొన్నాళ్లుగా తీవ్ర ఒత్తిడిలో ఉందని, విధులకు హాజరయ్యేందుకు వెనుకంజ వేయడం గమనించామని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే, ఆమెపై దారుణం జరిగితే, ఆత్మహత్య అని ఆసుపత్రి యాజమాన్యం చెప్పడం అనుమానాలకు తావిస్తోందని వారు పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో, సీబీఐ అధికారులు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను విచారిస్తున్నారు. 

కాగా, విచారణ నిమిత్తం లోపలికి వెళుతూ సందీప్ ఘోష్ మీడియాతో మాట్లాడారు. సీబీఐ తనను అరెస్ట్ చేయలేదని, దయచేసి తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేయవద్దని విజ్ఞప్తి చేశారు. 

అంతేకాకుండా, నిందితుడు సంజయ్ రాయ్ ని ఎదురుగా కూర్చోబెట్టి, అతడి సమక్షంలో తనను విచారిస్తున్నారన్న వార్తల్లో కూడా నిజంలేదని స్పష్టం చేశారు. సీబీఐ అధికారులు నన్ను విచారిస్తున్నారు... ఈ దశలో ఇంతకుమించి ఏమీ చెప్పలేను అని సందీప్ ఘోష్ పేర్కొన్నారు.


More Telugu News

Doctor's Rape & Murder RG Kar Medical College Sandip Ghosh CBI Kolkata West Bengal