మధ్యంతర బెయిల్ ఇవ్వలేం: కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

SC refuses Kejriwal plea for interim bail
  • సీబీఐకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
  • కేజ్రీవాల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
  • తదుపరి విచారణ 23వ తేదీకి వాయిదా
మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఢిల్లీ సీఎం పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు కూడా ఇచ్చింది. ఆగస్ట్ 23వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర దర్యాఫ్తు సంస్థను ఆదేశించింది. తదుపరి విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

అత్యవసరంగా విచారించాలంటూ విజ్ఞప్తి

కేజ్రీవాల్ పిటిషన్‌ను వెంటనే విచారించాలన్న ఆయన తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ 'అత్యవసర అభ్యర్థన'ను సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ సందర్భంగా మనుసింఘ్వీ మాట్లాడుతూ... మనీలాండరింగ్ కింద కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలోనే సీబీఐ అరెస్ట్ చేసిందని తెలిపారు. 

కేజ్రీవాల్ ఆరోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే 'ఎలాంటి మధ్యంతర ఉపశమనం ఇవ్వలేమ'ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అంతకుముందు, ఆగస్ట్ 5న కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఆయన అరెస్ట్ చట్టబద్ధమైనదేనని తీర్పు చెప్పింది. సీబీఐ కేసులో ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కేజ్రీవాల్‌కు సూచించింది. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అరెస్ట్ జరిగిందని అభిప్రాయపడింది.
Go Back to Shorts
Arvind Kejriwal
Supreme Court
AAP

More Telugu News