జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్
- జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ సభ్యుల క్రాస్ ఓటింగ్
- పది స్థానాలలోనూ కూటమి అభ్యర్ధుల విజయం
జీవిఎంసీలో వైసీపీకి 58 మంది కార్పోరేటర్ లు ఉండగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 37 మంది ఉన్నారు. సీపీఐ, సీపీఎం లకు ఒకొక్కరు ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు గానూ గత నెల 22న నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత 11 మంది వైసీపీ కార్పోరేటర్ లు ఆ పార్టీని వీడారు. వీరిలో ఆరుగురు టీడీపీలో, అయిదుగురు జనసేన పార్టీలో చేరారు. దీంతో వైసీపీ బలం 47కి పడిపోయింది. కూటమి బలం 49కి పెరిగింది. బుధవారం పోలింగ్ జరగనుండగా ఒక రోజు ముందు నుంచే తమ తమ కార్పోరేటర్ లను ప్రత్యేక శిబిరాలకు తరలించారు. అయితే వైసీపీ క్యాంప్ నకు నలుగురు కార్పోరేటర్ లు గైర్హాజరయ్యారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపునకు ఒక్కో అభ్యర్ధికి కనీసం 49 ఓట్లు రావాల్సి ఉంది. అయితే వైసీపీలో ఒక్క అభ్యర్ధికి కూడా అన్ని ఓట్లు రాకపోవడంతో అంతా ఓటమి చెందారు. వైసీపీ అభ్యర్ధుల్లో ఒక్కరికి మాత్రమే అత్యధికంగా 42 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో తమ పార్టీ కార్పోరేటర్ లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లుగా వైసీపీ అభ్యర్ధులు ఆవేదన చెందుతున్నారు.