బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు... డ్రైవింగ్ చేస్తూ వెళ్లడం కంటే నడుస్తూ త్వరగా వెళ్లొచ్చట!

  • దేశంలోని జనసమ్మర్ద నగరాల్లో ఒకటిగా ఉన్న బెంగళూరు
  • బెంగళూరులో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ లు
  • పెరిగిన జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కొరవడిన వైనం!
దేశంలోని జన సమ్మర్ద నగరాల్లో బెంగళూరు ఒకటి. పైగా భారతదేశ ఐటీ రాజధానిగా బెంగళూరు ఖ్యాతి గడించింది. ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా బెంగళూరు ట్రాఫిక్ గురించి గూగుల్ మ్యాప్స్ వెల్లడించిన అంశం ఆసక్తి కలిగిస్తోంది. 

బెంగళూరు రోడ్లపై 6 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం కంటే, నడస్తూ వెళ్లడం ద్వారా త్వరగా చేరుకోవచ్చట. బెంగళూరులో కేఆర్ పురం రైల్వే స్టేషన్ నుంచి గరుడాచార్ పాళ్యలోని బ్రిగేడ్ మెట్రోపొలిస్ వరకు ఏదైనా వాహనంలో వెళ్లడానికి 44 నిమిషాల సమయం పడితే, అదే దూరం నడిచి వెళ్లడానికి 42 నిమిషాలు పడుతుందని గూగుల్ మ్యాప్స్ చెబుతోంది. 

బెంగళూరు నగరం ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీలతో ఆర్థికంగా ఎంతో ఎదిగినప్పటికీ, మౌలిక వసతుల పరంగా ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్న విషయాన్ని ఈ అంశం ఎత్తిచూపుతోంది. 

బెంగళూరు నగర జనాభా వేగంగా పెరగడంతో పాటు, పక్కా ప్రణాళికబద్ధంగా నగర నిర్మాణం లేకపోవడం, పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకుని చూస్తే పరిమిత స్థాయిలోనే రవాణా సౌకర్యాలు ఉండడం వంటి అంశాలు నగర ట్రాఫిక్ ను ప్రభావితం చేస్తున్నాయి. 

క్రిక్కిరిసిపోతున్న రోడ్లు, గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ లు బెంగళూరులో సాధారణంగా మారాయి. ఉద్యోగుల సమయం చాలావరకు ట్రాఫిక్ లోనే వృథా అవుతుండడంతో, ఉత్పాదకత తగ్గిపోతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.


More Telugu News

Bengaluru Traffic Walking Driving Roads