విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: ఢిల్లీలో మదన్ మోహన్ డిమాండ్

  • ఢిల్లీ వెళ్లిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్
  • విజయసాయి డీఎన్ఏ టెస్టు చేయించుకోవాల్సిందేనని డిమాండ్
  • రేపు రాష్ట్రపతిని కలవబోతున్నామని వెల్లడి
ఓవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో తమ పార్టీ నిర్వహించిన ధర్నాతో బిజీగా ఉన్న వేళ... విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ డిమాండ్ చేశారు. 

"నా భార్య శాంతి ఏపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్... వీరిద్దరూ నా భార్యను కుట్రపూరితంగా లోబర్చుకుని, వేలాది కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకున్నారు. 

భూ అక్రమాలతో ఆగకుండా, వారు ఇంకా ముందుకెళ్లి నా భార్యతో అక్రమంగా బిడ్డను పొందారు. నా భార్య ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ నా బిడ్డ కాదు. వాళ్లు తప్పు చేశారు. అందుకే నేను మీడియా ముందుకు వచ్చాను. 

విజయసాయిరెడ్డి, పోతిరెడ్డి సుభాష్ డీఎన్ఏ టెస్టు చేయించుకుని, తమ శీలాన్ని నిరూపించుకోవాలి.... ఆ బిడ్డకు తండ్రెవరో తేలాలి. ముఖ్యంగా విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్టు చేయించుకోవాల్సిందే. ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. రేపు రాష్ట్రపతిని, రాజ్యసభ చైర్మన్ ను కూడా కలుస్తున్నాం" అని మదన్ మోహన్ వెల్లడించారు.


More Telugu News

Vijayasai Reddy Shanti Madan Mohan New Delhi Rajya Sabha Andhra Pradesh