కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు కీలక సూచనలు.. తప్పక పాటిస్తామన్న పవన్

సీఎం చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా కూటమి ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. 

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించొద్దని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మన అని కూడా చూడనని హెచ్చరించారు. కక్షసాధింపులు తాను కూడా చేయగలనని... రాజకీయ ప్రతీకారాలకు మనం వెళ్లొద్దని చెప్పారు. ఇసుక జోలికి ఎవరూ వెళ్లొద్దని అన్నారు. ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేద్దామని... మరిన్ని సలహాలు ఉంటే ఇవ్వాలని అడిగారు. 

వివేకా హత్యను ఇతరుల మీదకు నెట్టేసే ప్రయత్నం చేశారని... ఇప్పుడు వినుకొండలో కూడా అదే జరుగుతోందని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యవస్థలు పని చేయడం మానేశాయని చెప్పడానికి మదనపల్లె ఘటనే నిదర్శనమని... సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగితే, మర్నాడు వరకు రెవెన్యూ అధికారులు, పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. 

మూడు పార్టీల మధ్య సమన్వయం ఉండాలనే విషయాన్ని నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా తాను, జనసేన ఎమ్మెల్యేలందరూ సపోర్ట్ చేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.


More Telugu News