అత్యంత ఘనంగా పూరీ జగన్నాథుడి రథోత్సవం... రథం లాగిన రాష్ట్రపతి ముర్ము

ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఒడిశాలోని పూరీ పుణ్యక్షేత్రం నేడు ఇసుకేస్తే రాలనంతగా భక్తులతో క్రిక్కిరిసిపోయింది. పూరీ క్షేత్రంలో నేడు ఒకేసారి మూడు వేడుకలు చేపట్టడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. 1971 తర్వాత తొలిసారిగా ఒకే రోజున పూరీ జగన్నాథుడి నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర చేపట్టారు. 

ఇవాళ్టి ఘట్టానికి మరో విశిష్టత కూడా ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూరీ జగన్నాథస్వామి రథోత్సవానికి హాజరవడమే కాదు, రథం కూడా లాగారు. ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ తో కలిసి ఆమె సుభద్ర దర్పళదస్ రథం లాగారు. ఓ భారత రాష్ట్రపతి పూరీ జగన్నాథ రథయాత్రకు హాజరు కావడం ఇదే ప్రథమం. 

ఈ ఉత్సవానికి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝి, పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. కాగా, రథయాత్ర రేపు (జులై 8) కూడా కొనసాగనుంది.

Puri Jagannadha Ratha Yatra
Droupadi Murmu
Odisha
India

More Telugu News