ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్

  • భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో హేమంత్ సోరెన్ అరెస్ట్‌
  • జనవరి 31న రాంచీలోని రాజ్‌భవన్‌లో ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ 
  • ఇదే కేసులో ఐఏఎస్ అధికారి ఛవీ రంజన్‌తో పాటు మరో 25 మంది అరెస్టు
ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు భారీ ఊరట లభించింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆయనకు ఝార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు. 

ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా సోరెన్, ఐఏఎస్ అధికారి, రాంచీ మాజీ డిప్యూటీ కమిషనర్ ఛవీ రంజన్, భాను ప్రతాప్ ప్రసాద్ తదితరులతో సహా 25 మందికి పైగా వ్యక్తులను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అరెస్టు చేసింది. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంట‌నే జనవరి 31న రాంచీలోని రాజ్‌భవన్‌లో హేమంత్ సోరెన్‌ను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. అప్పటి నుంచి రాంచీలోని బిర్సా ముండా జైల్లోనే ఉన్నారు.

కాగా, అరెస్టయిన సమయంలో సోరెన్ తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తనపై మనీలాండరింగ్ కేసును మోపిందని అన్నారు.

అయితే సోరెన్, ఇతరులపై ఆరోపించిన భూ కబ్జాకు సంబంధించిన మనీ లాండరింగ్ విచారణలో భాగంగా రాంచీలో జూన్ 22న ఈడీ జరిపిన దాడుల్లో రూ. 1 కోటి నగదు, 100 బుల్లెట్ల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Hemant Soren
Land Scam Case
Jharkhand
Bail

More Telugu News