'ఓహో.. మీరేనా నన్ను ఓడించింది!' అంటూ పలకరించి, విషెస్ చెప్పిన నవీన్ పట్నాయక్ .. వీడియో ఇదిగో!
- ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేడీ
- ఓ స్థానంలో ఓడి, మరో స్థానంలో గెలిచిన మాజీ సీఎం నవీన్ పట్నాయక్
- ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి వచ్చిన బీజేడీ చీఫ్
- తనను ఓడించిన అభ్యర్థికి అభినందనలు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ ఓటమి పాలైంది. ఒడిశాను సుదీర్ఘంగా పాలించిన నవీన్ సైతం ఓ స్థానంలో ఓడిపోయారు. గంజాం జిల్లాలోని హింజలి, బొలంగీర్ జిల్లాలోని కంటాబంజి నుంచి పోటీ చేసిన ఆయన కంటాబంజిలో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ బాగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. హింజలి నుంచి గెలవడంతో నిన్న ప్రమాణస్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు.
ఈ క్రమంలో అందరినీ పలకరించి వెళ్తుండగా బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్బాగ్ లేచి ఆయనకు నమస్కరించారు. అనంతరం తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆ వెంటనే నవీన్ స్పందిస్తూ.. ‘‘ఓహో.. మీరేనా నన్ను ఓడించింది. మీకు అభినందనలు’’ అని చెప్పారు. మాజీ సీఎం వ్యాఖ్యలకు సీఎం మోహన్ మాఝీ, మంత్రులు, ఎమ్మెల్యేలు చిరునవ్వులు చిందించారు. తనను ఓడించిన అభ్యర్థిని పట్నాయక్ అభినందించడాన్ని చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి ఆరోగ్యకరమైన రాజకీయాలు ఒక్క ఒడిశాకే పరిమితం కాకూడదని, దేశమంతా ఉంటే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు.