విమానం అదృశ్యం.. అందులో మలావి వైస్ ప్రెసిడెంట్!

  • రాడార్‌తో తెగిపోయిన సంబంధాలు
  • కాంటాక్ట్ కోసం చేసిన ప్రయత్నాలు వృథా
  • ప్రకటన విడుదల చేసిన మలావి అధ్యక్ష కార్యాలయం
తూర్పు ఆఫ్రికాలోని మలావిలో ఓ విమానం అదృశ్యం అయింది. మలావీ డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన ఈ విమానంలో వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9:17 గంటలకు విమానం షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోలేదు. ఉదయం 10:02 గంటలకు ముజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కాకపోవడంతో విమానం అదృశ్యమైనట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.

రాజధాని నగరం లిలాంగ్వే నుంచి అది బయలుదేరిందని తెలిపింది. రాడార్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని, కాంటాక్ట్ కోసం ఏవియేషన్ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని మలావి అధ్యక్ష, కేబినెట్ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించాయి.

కాగా విమానం కోసం మలావి అన్వేషణ కొనసాగుతోంది. సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్‌కు అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. కాగా అదృశ్యమైన విమానంలో చిలిమా భార్య మేరీ, యునైటెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ మూవ్‌మెంట్ (యూటీఎం) పార్టీకి చెందిన పలువురు అధికారులు ఉన్నారు.

మూడు రోజుల క్రితం మాజీ క్యాబినెట్ మంత్రి రాల్ఫ్ కసంబర చనిపోయారు. ఆయన అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు లాజరస్ చక్వేరా తన అధికారిక పర్యటనలను రద్దు చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా విమానం మిస్సింగ్‌కు కారణం ఇంకా తెలియరాలేదు.


More Telugu News

Plane missing Malawis aulos Klaus Chilima