మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందలేదు: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్

  • రేపు సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ
  • తమకు ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదన్న కాంగ్రెస్ నేత
  • ఆహ్వానం వచ్చాక ఇండియా కూటమి నేతల హాజరు అంశంపై మాట్లాడుతామని వెల్లడి
నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి తమకు ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ అన్నారు. మోదీ రేపు సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. అయితే ఇప్పటి వరకు తమకు ఆహ్వానం అందలేదని జైరామ్ రమేశ్ చెప్పారు.

అంతర్జాతీయ నాయకులను మాత్రమే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారని... తమ నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదని తెలిపారు. ఇండియా కూటమి నేతలకు ఆహ్వానం అందిన తర్వాత ఆ అంశంపై మాట్లాడుతామన్నారు. ఇండియా కూటమి నేతలు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారా? అని మీడియా ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు.

రేపు సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు, మాల్దీవుల అధ్యక్షుడు, సీషెల్స్ ఉపాధ్యక్షుడు, బంగ్లాదేశ్ ప్రధాని, నేపాల్ ప్రధాని, భూటాన్ ప్రధాని తదితరులు హాజరవుతున్నారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

Jairam Ramesh
Congress
Narendra Modi
BJP
NDA

More Telugu News