వెంకటేశ్వర స్వామి వద్ద డ్రామాలు వేస్తే ఎవరికైనా ఇదే శిక్ష: సినీ నటుడు శివాజీ

  • నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు శివాజీ
  • అంతకుముందు చూసినప్పుడు స్వామి కొంచెం తేడాగా ఉన్నాడని వెల్లడి
  • ఇప్పుడు స్వామి కళకళలాడుతున్నాడని చమత్కారం
  • ఏపీలో ఇక స్వర్ణయుగం మొదలైందని వ్యాఖ్యలు 
టాలీవుడ్ నటుడు శివాజీ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన ఆయనను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, అంతకుముందు చూసినప్పుడు స్వామి కొంచెం తేడా ఉన్నాడని, ఇప్పుడు కళకళలాడుతున్నాడని చమత్కరించారు. 

ఇప్పుడంతా బాగుందని, వేస్ట్ మాటలు, వేస్ట్ ముచ్చట్లు చేయొద్దని అన్నారు. అమరావతి, పోలవరం స్వామి వారి లక్ష్యాలు అని, స్వామి దగ్గర మాట ఇచ్చిన వారికి ఎలాంటి పాఠాలు నేర్పారో అందరూ చూశారని శివాజీ పేర్కొన్నారు. 

చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, బీజేపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని, అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని, అందులో అనుమానమే అక్కర్లేదని అన్నారు. ఎవరూ తిట్టుకోనవసరం లేదని హితవు పలికారు. 

"ఇప్పటికైనా అర్థం చేసుకోండి... మీరు ఆ రోజు తిట్టినా, కొట్టినా కర్మ అనుసరించి ఇవాళ మిమ్మల్నే తిడుతున్నారు... ఇవన్నీ  అవసరమా... ఏదో భుజాన వేసుకుని, నెత్తిన వేసుకుని ప్రజలను ఇబ్బందిపెట్టడం సరికాదు... అందరూ బాగుండాలి... ఏపీకి స్వర్ణయుగం మొదలైంది... స్వామి నిర్ణయం ఇది... స్వామి వద్ద డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష" అని శివాజీ వ్యాఖ్యానించారు.


More Telugu News

Sivaji Tirumala Chandrababu Pawan Kalyan Andhra Pradesh