Postal Ballots: పోస్టల్ బ్యాలెట్ల అంశంలో తీర్పు రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

AP High Court adjourns verdict on postal ballots issue
  • పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై వివాదం
  • గెజిటెడ్ అధికారం సంతకం ఉంటే, స్టాంపు లేకపోయినా ఫర్వాలేదన్న సీఈవో
  • ఇది ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధం అంటూ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ
పోస్టల్ బ్యాలెట్లపై అటెస్టేషన్ అధికారి సీల్ తో పాటు సంతకం ఉండాలని గతంలో ఈసీ చెప్పిందని, కానీ ఏపీలో అందుకు విరుద్ధంగా సీఈవో మెమో ఇచ్చారంటూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇవాళ వాదనలు వినడం పూర్తి చేసిన ఏపీ హైకోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది. రేపు సాయంత్రం 6 గంటలకు పోస్టల్ బ్యాలెట్లపై తీర్పు వెలువరించనున్నట్టు హైకోర్టు పేర్కొంది. 

ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ సీఈవో  ఈ నెల 25, 27 తేదీల్లో రెండు మెమోలు ఇచ్చారని, వాటిని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అత్యవసర పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అంగీకరించింది.

అప్పిరెడ్డి తరఫున అడ్వొకేట్ సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే పోస్టల్ బ్యాలెట్ నిబంధనలు అమలు చేస్తున్నారని తెలిపారు.

ఫారం 13-ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, హోదా వివరాలు చేతితో రాసినా ఆమోదించాలని ఈసీ పేర్కొందని... కానీ అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే చాలని, స్టాంపు లేకపోయినా, హోదా వివరాలు చేతితో రాయకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్లు ఆమోదించాలని ఏపీ సీఈవో మెమోలు జారీ చేశారని ఆరోపించారు. 

ఈసీ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఏపీ సీఈవో ఇచ్చిన ఈ సడలింపులను రద్దు చేయాలని, ఈసీ గత ఏడాది జులైలో ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేసేలా చూడాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అటు, ఎన్నికల సంఘం తరఫున సీనియర్ అడ్వొకేట్ అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు.
Postal Ballots
YSRCP
AP High Court
CEO
Andhra Pradesh

More Telugu News